జెట్స్ కీ స్కూటర్ల తరలింపును అడ్డగింత

లోయర్ మానేరు డ్యాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి రాష్ట్ర మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో నగరపాలక సంస్థకు కేటాయించిన సీఎం అస్సూర్యెన్స్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన జెట్ స్కి స్కూటర్‌ను కొనుగోలు చేశారు. కాగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు శనివారం తరలిస్తున్న విషయాన్ని తెలుసుకొని బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో లేక్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. నగర ప్రజల డబ్బులతో కొనుగోలు చేసిన స్కూటర్ ను వెంటనే తిరిగి తీసుకురావాలంటూ నినాదాలు చేశారు.

ధర్నా విషయం తెలుసుకున్న పర్యాటకశాఖ అధికారులు తిరిగి జెట్ కి స్కూటర్ను మానేరు నదిలో యథాస్థానానికి చేర్చారు. ఈ సందర్భంగా నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ పై ప్రత్యేక దృష్టితో నగరాన్ని అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత రెండో స్థానంగా ఉంచేందుకు రూ.వందల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అందులోనే భాగంగా 24 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల లోయర్ మానేరు నదియందు పర్యాటక రంగంగా అభివృద్ధి చేసెందుకు మానేరు నదిలో రెండు జెట్స్ కి స్కూటర్లు, స్క్రూఈజ్ బోట్ ను కొనుగోలు చేశారన్నారు.

కాళేశ్వరం జలాలతో మానేరు నదిలో ఎప్పుడూ 20 టీఎంసీలు తగ్గకుండా నీరు నిల్వ ఉంచి పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు బోట్లను నడిపిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే కరీంనగర్‌ను ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడదిన్నర కాలంలో కలకలాడిన మానేరు నది వెలవెలబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఆపేశారని ఎల్ఎండీలో నీటి నిలువ డెడ్ స్టోరేజ్ కి పడిపోయిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎల్ఎండీలో నీళ్లు నింపడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో పాటు రివర్ ఫ్రంట్ పనులు కూడా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

కరీంనగర్లో గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధిని కనుమరుగు చేసే దిశగా కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే నేడు దొంగతనంగా ఎల్ఎండీ లో ఉన్నటువంటి స్కూటర్‌ను హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధిని వారి ఆనవాళ్లను తుడిచేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రజల డబ్బులు ద్వారా కొనుగోలు చేసిన జెట్ కి స్కూటర్ను తిరిగి తెప్పించడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ప్రజల ఆస్తిని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు.